క్రికెట్‌పై అందుకే ఆసక్తి పోయింది.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఎన్టీఆర్

  • తండ్రి హరికృష్ణే కారణమన్న తారక్
  • ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ తాజా ఎపిసోడ్‌లో చర్చ
  • క్రికెట్‌పై ఎన్టీఆర్ కామెంట్స్
  • భార్య ప్రణతి గురించి కూడా మాట్లాడిన హీరో
‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ తాజా ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభిరాం అనే కంటెస్టెంట్‌ ఆడుతుండగా.. అతని 9వ ప్రశ్న క్రికెట్ గురించి వచ్చింది. ఈ సందర్భంగానే తారక్.. ఈ ఆటపై తనకున్న ఇష్టాన్ని వెల్లడించాడు.

తనకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టమని చెప్పిన తారక్.. టీవీలో చూడడం అంటే మాత్రం పెద్దగా ఇష్టపడనని చెప్పాడు. దీనికి కారణం తండ్రి హరికృష్ణే అని వెల్లడించాడు. చిన్నతనంలో తన తండ్రి హరికృష్ణ ఉదయాన్నే టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌ను వీసీఆర్‌లో రికార్డ్ చేయమని చెప్పి, ఎలా చేయాలో నేర్పించారట. దీంతో ఉదయాన్నే ఆ మ్యాచ్ ను తను పూర్తిగా చూడాల్సి వచ్చేదని, మళ్లీ సాయంత్రం కూడా తండ్రితో కలిసి అదే మ్యాచ్ చూసేవాడినని ఎన్టీఆర్ తెలిపాడు. ఇలా చూసీ చూసీ తనకు క్రికెట్ బోర్ కొట్టేసిందని అన్నాడు.

ఇదే సమయంలో తన భార్య ప్రణతి గురించి కూడా ఆసక్తికర విషయం వెల్లడించాడు. తనతో పరిచయమైన 8 నెలల తర్వాత కూడా ఆమె తాను ప్రపోజ్ చేస్తే ‘యస్’ చెప్పలేదని ఎన్టీఆర్ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. భార్యను అర్థం చేసుకున్న ఏ మగాడైనా జీవితంలో సక్సెస్ అవుతాడని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొట్టి తారక్‌ను అభినందించారు.

Evaru Meelo Koteeswarulu
Jr NTR
Cricket
Tollywood

More Telugu News